- రూ.1,410తో 11 వస్తువులు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గతంలో ప్రజాధరణ పొందిన బేబీ కిట్ల పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య మంత్రిత్వశాఖ చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఆమోదించారు. 2014-19 మధ్యకాలంలో అమలైన ఈ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో ఈ పథకానికి జాతీయ ఆరోగ్యమిషన్ కింద కొంత మేరకు కేంద్ర సాయం అందించేవారు. ఈ సాయాన్ని కేంద్రం నిలిపేసింది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి రాష్ట్ర బడ్జెట్ నిధుల నుండే ఖర్చు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి చేసిన ప్రతిపాదన ను సిఎం ఆమోదించారు. ఈ బేబీ కిట్లో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన 11 వస్తువులు ఉండనున్నాయి. వీటి విలువ రూ.1,410గా అంచనా వేశారు. ఈ కిట్లో దోమతెర, బేబీబెడ్, వాటర్ప్రూఫ్ కాట్షీట్, డ్రెస్, వాషబుల్ నేప్కిన్స్, టవల్, పౌడర్, షాంపూ, ఆయిల్, సబ్బు, సోప్బాక్సు, రాటిల్ టారు ఉంటాయి.