ప్రజాశక్తి-యల్లనూరు (అనంతపురం జిల్లా) : అప్పుల బాధతో అరటి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా యల్లనూరు మండల పరిధిలోని నీర్జాం పల్లి కొట్టాల గ్రామంలో సోమవారం అర్థ రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు… ఆర్ కృష్ణయ్య (51)కు నాలుగు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. అందులో అరటి పంట సాగు చేశారు. సాగు నిమిత్తం దాదాపు రూ. పది లక్షలు అప్పులు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో గత నెలల వీచిన ఈదురుగాలులకు అరటి చెట్లన్నీ నేలకూలాయి. పంట మొత్తం చేతికందకుండా పోవడంతో చేసిన అప్పులు తీర్చే మార్గం కన్పించక ఆయన మనస్తాపానికి గురయ్యారు. సోమవారం అర్థ రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రపోయాక కృష్ణయ్య ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతునికి భార్య భవాని, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
