- మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గత ప్రభుత్వం రద్దు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీంను పునరుద్ధరించే అంశాన్ని రాష్ట్రప్రభుత్వం పరిశీలిస్తోందని సాంఘిక సాంఘిక సంక్షేమ శాఖమంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. శాసనసభలో సాంఘిక సంక్షేమశాఖ గ్రాంట్లపై జరిగిన చర్చకు ఆయన వివరణ ఇస్తూ, గత ప్రభుత్వం ఎస్సిలకు 27 సంక్షేమ పథకాలను నిలిపివేసిందన్నారు. ఇందులో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కూడా ఉందన్నారు. ఎస్సి,ఎస్టి ఇళ్ల నిర్మాణాల కోసం అదనపు బడ్జెట్ కేటాయించామని చెప్పారు.
బిసి ప్రత్యేక రక్షణ చట్టం కోసం చర్చలు: మంత్రి సవిత
బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు బిసి సంక్షేమ శాఖమంత్రి ఎస్ సవిత తెలిపారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందించడానికి వచ్చే విద్యాసంవత్సరం నుంచి సన్న బియ్యం వినియోగించనున్నామని చెప్పారు. బిసి హాస్టళ్ల మరమ్మత్తుల కోసం ఒక్కొ ఎంపి వద్ద రూ. 1కోటి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని తెలిపారు. ఎంపిలందరికీ లేఖలు రాశామని చెప్పారు. కార్పొరేట్ సోషల్ రెస్పన్స్బిలిటీ(సిఎస్ఆర్) ఫండ్స్ కింద నిధులు కేటాయించాలని పార్లమెంట్లో ఉన్న పారిశ్రామికవేత్తలకు కూడా లేఖలు రాశామని వెల్లడించారు. అనంతరం మైనార్టీ సంక్షేమశాఖ గ్రాంట్లపై ఆ శాఖమంత్రి ఎన్ఎండి ఫరూక్ వివరణ ఇచ్చారు. గిరిజన, సాంఘిక, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖల డిమాండ్లను శాసనసభ ఆమోదించింది.