- కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు
ప్రజాశక్తి – ములగాడ (విశాఖపట్నం) : రక్తపు బొట్టు మనిషి ప్రాణానికి మెట్టు అని కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు అన్నారు. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (శ్రీహరిపురం) సహకారంతో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యాన మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. గత రెండు దశాబ్దాలుగా ఏటా మేడే సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని విశాఖలోని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆవరణలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదీ కార్యక్రమాన్ని తలపెట్టగా విశేష స్పందన దక్కింది. 177 మంది కోరమండల్ ఉద్యోగులు, యాజమాన్య ప్రతినిధులు, కాంట్రాక్టు ఉద్యోగులు రక్తదానం చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారందరికీ యూనియన్ అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం.బాషా, కార్యవర్గ సభ్యులు రామరాజు, సుధాకర్, సందీప్, దినకర్ అభినందనలు తెలిపారు. కోరమాండల్ వైజాగ్ యూనిట్ హెడ్ జ్ఞాన సుందరం మాట్లాడుతూ కార్యక్రమాన్ని మెచ్చుకున్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఉద్యోగులను కోరారు. వైజాగ్ యూనిట్ హెచ్ఆర్ హెడ్ ఆర్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం మల్కాపురంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సింగరావు మాట్లాడారు.