విష్ణు కళాశాలకు బాంబు బెదిరింపు

  • రాత్రి వరకూ తనిఖీలు

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ : పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం ప్రజలు బాంబు బెదిరింపు మెయిల్‌తో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జాతీయ స్థాయిలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ, డాక్టర్‌ బివి రాజు ఫౌండేషన్‌ విద్యాసంస్థల ప్రాంగణంలోని విష్ణు డెంటల్‌ కళాశాలలో బాంబు పెట్టినట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రామరాజుకు బుధవారం మధ్యాహ్నం మెయిల్‌ వచ్చింది. యాజమాన్యం అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విద్యార్థులను, అధ్యాపకులను, సిబ్బందిని బయటకు పంపించేశారు. జిల్లా ఎస్‌పి అద్నాన్‌ నయీం పర్యవేక్షణలో బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ రంగంలోకి దిగి విష్ణు డెంటల్‌ కళాశాలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అలాగే డాగ్‌ స్క్వాడ్‌ను సైతం రంగంలోకి దింపి అనుమానిత వస్తువులు, పరికరాలు ఏవీ లభించలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సైబర్‌ క్రైమ్‌ టీమ్‌ రంగంలోకి దిగి మెయిల్‌ ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు భీమవరం రూరల్‌ ఎస్‌ఐ వీర్రాజు తెలిపారు.

➡️