ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర బడ్జెట్లో విద్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఎపిటిఎఫ్ విమర్శించింది. బడ్జెట్లో విద్యకు కేవలం 2.5 శాతం నిధులు కేటాయించడం సబబుగా లేదని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదాయ పన్నుకు సంబంధించి రూ.12 లక్షలలోపు ఆదాయానికి కొంత రిబేటు కల్పించినా, పాత పన్ను విధానంలో 80సి కింద పొదుపులు ప్రామాణిక తగ్గింపులో ఎలాంటి మార్పులు చేయకపోవడం కొత్త పన్ను విధానాన్నే ఎంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
పొదుపును ప్రోత్సహించని బడ్జెట్ : ఎస్టియు
పొదుపును ప్రోత్సహించే విధంగా కేంద్ర బడ్జెట్లో నిర్ణయాలు లేవని ఎస్టియు పేర్కొంది. ఆదాయ పన్ను చెల్లించే వారందరినీ కొత్త పన్ను విధానంలోకి తెచ్చి పాత పన్ను విధానాన్ని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయిశ్రీనివాస్, మల్లు రఘునాథరెడ్డి పేర్కొన్నారు.
ఉద్యోగులకు ఊరట లేదు : బిటిఎ
ఉద్యోగులకు పెద్దగా ఊరట లేదని బహుజన టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్ తెలిపారు. రూ.12 లక్షల వరకు ఉన్న పన్ను మినహాయింపు వెనుక చాలా మతలబు ఉందన్నారు.