బర్లీ పొగాకును కొనుగోలు చేయాలి

May 10,2025 00:34 #Barli Farmers

ప్రభుత్వమే రూ.100 కోట్లు కేటాయించాలని ధర్నా
ప్రజాశక్తి-నాగులుప్పలపాడు (ప్రకాశం జిల్లా) : బర్లీ పొగాకును కొనుగోలు చేయాలని కోరుతూ శుక్రవారం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు బస్టాండ్‌ సెంటర్‌లో రైతులు ధర్నా చేశారు. రైతు, కౌలురైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జె జయంతిబాబు, పమిడి వెంకట్రావు మాట్లాడుతూ రైతులను అనేక ప్రయివేట్‌ కంపెనీలు ప్రోత్సహించి బర్లీ పొగాకు సాగు చేయించాయని, దిగుబడి వచ్చాక కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం కూడా కంపెనీలతో కొనుగోలు చేయించడంలో విఫలమైందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి రూ.వంద కోట్లు కేటాయించి రైతుల వద్ద ఉన్న బర్లీ పొగాకు మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పొగాకు రైతులందరినీ ఐక్యం చేసి త్వరలో కలెక్టర్‌ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కౌలు రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.శ్రీకాంత్‌, జి బసవపున్నయ్య, కాకాని సుబ్బారావు, పాలపర్తి యోనా, హజరత్తయ్య, మండవ ఆంజనేయులు, వివిధ గ్రామాల బర్లీ పొగాకు రైతులు పాల్గొన్నారు.

➡️