ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్ (తూర్పు గోదావరి) : పాఠశాల విద్యార్థుల సైకిళ్లను కారు ఢీకొట్టడంతో నలుగురు విద్యార్థులకు గాయాలవ్వగా, ఒకరికి తీవ్రగాయాలైన ఘటన శనివారం ఉదయం గోదావరి కాటన్ బ్రిడ్జ్ పై జరిగింది.
కొవ్వూరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … ఈరోజు ఉదయం మండలంలోని మద్దురులంక గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు ఎవరికివారు వారివారి సైకిళ్ళ పై మద్దూరు లంకగ్రామంలో బయలుదేరి కాటన్ బేరేజ్ మీదుగా మద్దూరుగ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలకు వెళుతున్నారు. బ్రిడ్జిపై రాజమండ్రి వైపునుండి వస్తున్న కారు వరుసగా వెళుతున్న ఐదుగురు విద్యార్థులని ఢీకొట్టడంతో విద్యార్థులు సైకిళ్ల పైనుండి పడిపోయారు. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం చేర్పించారు. మరొక విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికత్స కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను అదుపులోనికి తీసుకోని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.