- న్యాయం చేయాలని మృతదేహంతో గ్రామస్తుల ఆందోళన
ప్రజాశక్తి – గరుగుబిల్లి (పార్వతీపురం మన్యం జిల్లా) : నిర్లక్ష్యంగా ఓ కానిస్టేబుల్ కారు నడుపుతూ ఆటోను వెనుక నుండి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందారు. ఈ సంఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉల్లిభద్ర గ్రామానికి చెందిన బనిశెట్టి గణేష్ (42) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం రావుపల్లి గ్రామం నుంచి పార్వతీపురం వెళ్తుండగా సీతారాంపురం జంక్షన్ వద్ద ఖడ్గవలస నుంచి పార్వతీపురం వెళ్తున్న గరుగుబిల్లి పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఆరిక ప్రసాద్ నిర్లక్ష్యంగా కారు నుడుపుతూ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ గణేష్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆయనను విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఈ ప్రమాదంపై పోలీసులు నమోదు చేయకపోవడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్ ఎదుట సిపిఎం నాయకులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం మృతదేహంతో ఉల్లిభద్ర రహదారిపై ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒక వ్యక్తి మరణానికి కారణమైన కానిస్టేబుల్పై కేసు నమోదు చేయకపోవడం అన్యాయమని అన్నారు. ఈ ప్రమాదంపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ప్రమాదానికి కారణమైన కానిస్టేబుల్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, మరణించిన ఆటో డ్రైవర్ కుటుంబానికి పరిహారం చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక స్టేషన్ ఎస్ఐ రమేష్ నాయుడు ఆందోళనకారులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.