వంశీపై భూ ఆక్రమణల కేసు

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై 9న ఉత్తర్వులు
ప్రజాశక్తి-అమరావతి : భూ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ గన్నవరం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 9న తీర్పు వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది. వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్ల జస్టిస్‌ టి మల్లికార్జునరావు ప్రకటించారు. అప్పటి వరకు పిటిషనర్‌ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోరాదని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. తన భూమిని ఆక్రమించుకుని, నకిలీ డాక్యుమెంట్లను తయారుచేసి వేరేవాళ్లకు అమ్మేశారంటూ విజయవాడకు చెందిన సుంకర సీతామహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గన్నవరం పోలీసులు వంశీపై ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పిటిషనర్‌కు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని సీనియర్‌ అడ్వకేట్‌ ఎన్‌ శ్రీరామ్‌ వాదించారు. ఇది అక్కాచెల్లెళ్ల మధ్య జరుగుతున్న సివిల్‌ వివాదమని, దీనిపై సివిల్‌ సూట్‌ కింది కోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పారు. దీనిని క్రిమినల్‌ కేసుగా నమోదు చెల్లదన్నారు. పోలీసుల తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ ప్రతివాదనలు చేస్తూ.. డాక్యుమెంట్‌ను ఫోర్జరీ చేసి ఫిర్యాదుదారు భూమిని బలవంతంగా ఆక్రమించడం క్రిమినల్‌ చర్యే అవుతుందన్నారు. ఆక్రమించుకున్న భూమిలోకి కాలుపెడితే కడతేర్చుతామని బెదిరించారని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు.. ఈ నెల 9న తుది నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించింది.

➡️