వాల్పోస్టర్ ఆవిష్కరించిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో: టిడిపి కూటమి ప్రభుత్వం ఆప్కాస్ రద్దు చేస్తానన్న అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని కోరుతూ ఈ నెల 19న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి తిరుపతి నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో చలో విజయవాడ వాల్పోస్టర్ను ఆదివారం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ జెఎసి చైర్మన్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆప్కాస్ రద్దు చేయడం వల్ల లక్షా 20 వేల మందికి నష్టం జరుగుతుందన్నారు. జిఒ నెంబర్ 2 సవరించి అందరికీ మినిమం టైమ్ స్కేలు వర్తింపజేయాలని, ఇప్పటివరకు పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చి ఆయా డిపార్ట్మెంట్ల ద్వారా నేరుగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆప్కాస్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తరలిరావాలని జెఎసి రాష్ట్ర అధ్యక్షులు జి చిన్నబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా జెఎసి చైర్మన్ నాగ వెంకటేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయ చంద్ర, ఆప్కాస్ యూనియన్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, నరసింహలు తదితరులు పాల్గన్నారు.
