- చేనేత అండ్ జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత
- ఎమ్మిగనూరులో మెగా టెక్స్టైల్పార్కుకు భూమిపూజ
ప్రజాశక్తి-ఎమ్మిగనూరు : రాష్ట్రంలో చేనేతలకు స్వర్ణయుగం వచ్చిందని, నేతన్నకు 365 రోజులు పని కల్పిస్తామని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత అండ్ జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసిలో మంగళవారం ఎంఎస్ఎంఇ కింద మెగా టెక్స్లైల్ పార్కు నిర్మాణానికి మంత్రులు ఎన్ఎండి ఫరూక్, టీజీ భరత్, ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి, అధికారులతో కలిసి ఆమె భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ చేనేతలకు రూ. 348 కోట్ల విలువైన క్లస్టర్లు మంజూరు చేశామని, లేటెస్ట్ డిజైన్లపై శిక్షణ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, అర్హులైన వారికి 90 శాతం సబ్సిడీతో ఫ్రేమ్ లూమ్స్ ఇస్తామని, త్వరలో రూ. ఐదు కోట్ల త్రిఫ్ట్ ఫండ్ అందిస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో రూ. 172 కోట్లతో నిర్మించిన యూనిటీ మాల్లో చేనేత ఉత్పత్తులను నిరంతరం ప్రదర్శించుకోవచ్చని అన్నారు. మెగా టెక్స్టైల్ పార్క్ను అభివృద్ధి చేస్తామని, 25 ఎకరాల్లో హ్యాండ్లూమ్ పార్క్, మిగిలిన భూమిలో ఇండిస్టియల్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు బ్రాండ్ వస్త్రాలకు సహకారం అందిస్తామని, రిలయన్స్ కంపెనీ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ చేనేతలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. చేనేత అండ్ జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి మాట్లాడుతూ టెక్స్టైల్ పార్క్ మొదటి దశ అభివృద్ధికి ఎపిఐఐసి నుంచి రూ. 6.9 కోట్లు కేటాయించామని, 77 ఎకరాల పార్క్లో 22 ఎకరాలు చిన్న ప్లాట్లుగా మగ్గాలు పెట్టుకోవడానికి, మిగిలిన భూమి వస్త్ర పరిశ్రమల కోసం కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు కలెక్టర్ రంజిత్బాష, ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, టిడిపి మంత్రాలయం ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి , టిడిపి ఆలూరు ఇంచార్జ్ వీర బద్రగౌడ్ , డిసిఎంఎస్ చైర్మన్ నాగేశ్వరయ్య యాదవ్ పాల్గొన్నారు.