ఆగిరిపల్లి (ఏలూరు) : టిడిపికి మొదటి నుంచీ వెన్నెముక బీసీ వర్గాలేనని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. తనతో పాటు ప్రధాని మోడి, డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్ కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ … బీసీలకు కార్పొరేషన్లు పెట్టి ఆయా వర్గాలకు మేలు చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ హయాంలో బీసీ గురుకులాలు వచ్చాయని తెలిపారు. విదేశాల్లో చదువుకునే వారికి రూ.15 లక్షల సాయం అందిస్తున్నామన్నారు. సివిల్స్, గ్రూప్స్ రాసేవారికి అండగా ఉన్నామన్నారు. అమరావతిలో సివిల్స్ కోచింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. బ్యాచ్కు 500 మందికి చొప్పున శిక్షణ ఇస్తామన్నారు. ఆదరణ-3 కింద ఏటా రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. నేతన్నలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఇల్లు కట్టుకునే వెనుకబడిన వర్గాలకు అదనంగా రూ.50వేలు ఇస్తామన్నారు. ఎస్సీల ఇళ్లకు ఉచితంగా సోలార్ ప్యానల్స్ మంజూరు చేస్తున్నామని చంద్రబాబు ప్రసంగించారు.
