దేవినేని అవినాష్ను కూడా…
టిటిడి కార్యాలయంపై దాడి కేసు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : టిడిపి రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో వైసిపి నాయకులు, ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిని గుంటూరులోని సిఐడి కార్యాలయంలో అధికారులు శుక్రవారం విచారించారు. ఈ దాడికి సంబందించి పలు ప్రశ్నలను సిఐడి అధికారులు ఆయనను ఆడిగారు. సజ్జలతోపాటు విజయవాడ వైసిపి నాయకులు దేవినేని అవినాష్ కూడా సిఐడి విచారణకు హాజరయ్యారు. సజ్జల వాహనాన్ని పోలీసులు కోర్టు రోడ్డు వద్దనే నిలిపివేశారు. దీంతో, ఆయన అక్కడి నుంచి సిఐడి కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లారు. సిఐడి అధికారుల ప్రశ్నలకు ‘నాకు ‘తెలియదు. గుర్తు లేదు, నాకేం సంబంధమూ లేదు’ అంటూ సజ్జల సమాధానం ఇచ్చినట్టు సమాచారం.
బదులు తీర్చుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి : సజ్జల
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, తాము బదులు తీర్చుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సజ్జల అన్నారు. సిడిఐ విచారణ అనంతరం విలేకర్లతో ఆయన మాట్లాడారు. తనపై అక్రమ కేసు బనాయించినా బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు. టిడిపి నాయకులు కొమ్మారెడ్డి పట్టాభి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్ను దుర్భాషలాడిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యాలయంపై దాడి జరిగి ఉండవచ్చని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, సంతకాలు పెట్టాలని బెదిరించడం, జైలుకు పంపడం టిడిపి కూటమి ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని, రాష్ట్రంలో ఏడాది కాలంగా రెడ్బుక్ వేధింపులు ఎక్కువయ్యాయని, చంద్రబాబు నుంచి కింది స్థాయి వరకూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాడికొండ మండలం కంతేరు ఎంపిటిసిపై కూడా దురుసుగా ప్రవర్తించారని, మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదని, భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని అన్నారు. పోసాని ఎప్పుడో మాట్లాడితే ఇప్పుడు కేసు పెట్టారని, సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటికి ఎలాంటి అనుమతీ లేకుండా పోలీసులు వెళ్లి ఇంట్లో సోదాలు చేశారని తెలిపారు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆలోచించాలన్నారు. ఇంకా ఎంతమందిని జైలులో పెడతారని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ కూడా తప్పుడు కేసేనని తెలిపారు. సజ్జలకు సంఘీభావంగా సిఐడి కార్యాలయం వద్దకు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసిపి జిల్లా నాయకులు వచ్చారు.