ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కును ప్రయివేటీకరించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను పోరాటాలతో తిప్పికొడతామని సిఐటియు నాయకులు ఎన్.రామారావు, డిసిహెచ్.వెంకటేశ్వరరావు అన్నారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి 1526వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్ప్లాంట్లోని పలు విభాగాల కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం శతవిధాలా ప్రయత్నిస్తోందన్నారు. సొంత గనులు కేటాయించడం లేదని, కార్మికులకు ప్రతినెలా సక్రమంగా జీతాలు ఇవ్వడంలేదని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తోందని మండిపడ్డారు. మోడీ సర్కారు అనుసరిస్తోన్న విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులు ఐక్యంగా పోరాడుతున్నారని, వారికి రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులపై జరుగుతున్న దాడులను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
