- ఎమర్జెన్సీ సమయంలో సన్నద్ధతపై ప్రజలకు అవగాహన
ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం) : భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన ఆదేశాల మేరకు విశాఖలో పలు చోట్ల బుధవారం సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. అనుకోని రీతిలో ఉగ్రదాడులు జరిగినా, బాంబులు పేలినా, అగ్ని ప్రమాదాలు సంభవించినా ఎలా వ్యవహరించాలనే అంశాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ రక్షణ దళాలు ప్రదర్శనలు ఇచ్చాయి. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో విశాఖ వన్టౌన్ పరిధిలోని రాణిబొమ్మ సెంటర్, క్వీన్ మేరీ బాలికోన్నత పాఠశాలలో బుధవారం సాయంత్రం వేర్వేరుగా నిర్వహించిన ఆపరేషన్లలో సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్, పోలీసు, జివిఎంసి, రెవెన్యూ, సివిల్ సప్లైస్, వైద్య శాఖ అధికారులు, సిబ్బంది, పలువురు వలంటీర్లు భాగస్వామ్యమయ్యారు. ముందుగా రాణీబొమ్మ సెంటర్లో రెండు భవనాల్లో ఉగ్రమూకలు పొగ బాంబులతో దాడులు చేయగా స్పందించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. వెనువెంటనే సంఘటనా స్థలానికి మాస్క్లు ధరించి చేరుకున్న ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, సహాయక సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్న ప్రజలను కాపాడారు. నిచ్చెన సాయంతో కొందరిని కిందకు దించగా, మరికొందరిని భద్రతా సిబ్బంది మెట్ల మార్గం ద్వారా కిందకు తీసుకొచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన ప్రమాద స్థలానికి సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరాలకు తరలించి ప్రథమ చికిత్స అందజేశారు.
వన్టౌన్ పరిధిలోని క్వీన్ మేరీ బాలికోన్నత పాఠశాలలో ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేకంగా మాక్డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రమూకల దాడుల నేపథ్యంలో తరగతి గదుల్లో చిక్కుకున్న విద్యార్థులను, ఉపాధ్యాయులను ఎలా రక్షించాలో, వారు ఎలా వ్యవహరించాలో ప్రదర్శనలు ఇస్తూ అప్రమత్తం చేశాయి. అలారం మోగినప్పుడు ఏ విధంగా స్పందించాలో.. సేఫ్ జోన్కు ఎలా చేరుకోవాలో తెలిపాయి. రోప్ల సాయంతో భవనాలపై నుంచి కిందకు ఎలా దిగాలో చేసి చూపించాయి. ఈ క్రమంలో ఎస్డిఆర్ఎఫ్ ప్రత్యేక వాహనంలో ఉండే పరికరాల వినియోగం, వాటితో ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవచ్చో ప్రజలకు అవగాహన కల్పించారు.