ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : దేవాదాయశాఖలో ఖాళీగా ఉన్న 5 విభాగాల్లోని 137 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయాలని అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం దేవాదాయశాఖపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి సిఎం సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్లు-6, అసిస్టెంట్ కమిషనర్లు-5, గ్రేడ్-1 ఇఒలు 6, గ్రేడ్-3 ఇఒలు 104, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 16 పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేసి ఆలయాలు సమర్ధవంతంగా నిర్వహించేలా చూడాలన్నారు. వాటతో పాటు ఖాళీగా ఉన్న 200 వైదిక సిబ్బంది ఖాళీలను కూడా అర్హులైన వారితో భర్తీ చేయాలని సిఎం సూచించారు. రాష్ట్రంలో 23 ప్రధాన ఆలయాలు ఉండగా, వీటిలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, కనకదుర్గమ్మ, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం ఆలయాల్లో మాత్రమే నిత్యాన్నదానం పథకం అమలవుతోందని, మిగిలిన 16 ఆలయాల్లోనూ అన్నదాన పథకం అమలు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. నాణ్యతా పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించాలన్నారు.
23 ఆలయాల మాస్టర్ ప్లాన్లు రూపొందించాలి : సిఎం
రాష్ట్రంలోని అన్ని ఆలయాలను దశలవారీ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, మొదటి దశలో 23 ఆలయాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని అధికారులకు సిఎం చంద్రబాబు ఆదేశించారు. ఆలయాల భూములు ఆక్రమణకు గురవ్వకుండా, ఆస్తులను పరిరక్షించేలా, వాణిజ్య సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు కమిటీ వేసి సమగ్ర విధానాన్ని తీసుకురావాలన్నారు. దీంతో వచ్చే ఆదాయాన్ని తిరిగి ఆలయాల అభివృద్ధికి వినియోగించాలని, ఈ క్రమంలో దేవాదాయ భూములు హోటళ్లకు లీజుకు ఇచ్చేటప్పుడు అక్కడ శాఖాహారం మాత్రమే అందించాలని సిఎం పేర్కొన్నారు.
నోటిఫైడ్ ఆలయాల ద్వారా ఏటా రూ.1,300 కోట్లు ఆదాయం
రాష్ట్రంలో మొత్తం నోటిఫైడ్ ఆలయాలకు ఏడాదికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం వస్తోందని, అందులో రూ.850 కోట్లు టాప్ 7 ఆలయాల నుంచి సమకూరుతోందని సిఎం చంద్రబాబు వెల్లడించారు. రూ.5 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాల నుంచి 9 శాతం మొత్తాన్ని కామన్ గుడ్ ఫండ్ (సిజిఎఫ్) కింద జమచేస్తున్నారన్నారు. 2024-25లో సిజిఎఫ్కు రూ.149 కోట్లు రాగా, రాష్ట్రంలో వివిధ ఆలయాల్లో రూ.1,11 కోట్లతో 48 పనులు జరుగుతున్నాయన్నారు. మొత్తం నోటిఫైడ్ ఆలయాలు 25,028 కాగా, వీటిలో ప్రస్తుతం రూ.50 లక్షల పైన ఆదాయం వచ్చే 6ఎ కేటగిరి ఆలయాలు 169, రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్న 6బి కేటగిరి ఆలయాలు-321, రూ.15 లక్షల కన్నా ఆదాయం తక్కువ వచ్చే 6సి కేటగిరి ఆలయాలు 24,538 ఉన్నాయని సిఎం తెలిపారు.