గుంటూరు : స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం కృషి చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నారేడ్కో) , క్యాపిటల్ జోన్ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహిస్తున్న 16వ నారేడ్కో ప్రోపర్టీ షో ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేశారు.
ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. సభా వేదికపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ … గత పాలకులు అన్ని రంగాలనూ పతనావస్థకు తీసుకొచ్చారని.. రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారని విమర్శించారు. పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకొస్తామన్నారు. కొత్త ఏడాది నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ రంగం అధ్వానంగా మారిందని విమర్శించారు. ప్రజలు తమను నమ్మి 93 శాతం స్ట్రైక్ రేట్తో విజయం కట్టబెట్టారని, అధికారంలోకి రాగానే రాష్ట్ర పున: నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. ప్రధాని మోడీ విశాఖకు వచ్చి రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని చెప్పారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందుకెళుతోందన్నారు. నిర్మాణ రంగం అభివఅద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఈ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని చెప్పారు. ఉచిత ఇసుక విధానం తెచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చామన్నారు. నరెడ్కో, క్రెడాయ్ వంటి సంస్థలు కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రియల్ ఎస్టేట్ సమస్యల పరిష్కారానికి ముందుంటామన్నారు. వైసిపి పాలనలో అన్నింటికంటే ఎక్కువగా నిర్మాణ రంగం దెబ్బతిందన్నారు. అధికారంలోకి రాగానే ఈ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఎప్పుడూ చూడనివిధంగా భూ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయని, వైసిపి ప్రభుత్వం చేసిన అక్రమాలే దీనికి ముఖ్య కారణం అని ఆరోపించారు. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో టీడీఆర్ బాండ్లు తీసుకుని కొంతమంది నష్టపోయారని అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం కృషి చేస్తున్నామన్నారు. తాము వచ్చాక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామని తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేదే తమ లక్ష్యం అని చంద్రబాబు అన్నారు.