నామినేటెడ్‌ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నాం : సిఎం చంద్రబాబు

అమరావతి : నామినేటెడ్‌ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని ఎపి సిఎం చంద్రబాబు వెల్లడించారు. శుక్రవారం టిడిపికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నామినేటెడ్‌ పదవుల భర్తీకిగాను పేర్లను సిఫారసు చేసేందుకు కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని చెప్పారు. ఆయా పదవుల కోసం పార్టీకి కష్టపడినవారి వివరాలు అందించాలని కోరారు. ” సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాలకు ఛైర్మన్ల నియామకం చేపడతాం. నామినేటెడ్‌ పదవుల కోసం 60 వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తున్నాం. మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దు. రెండేళ్ల పదవీకాలం ముగిశాక మిగిలినవారికి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటికే పదవులు తీసుకున్నవారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇప్పుడూ హుందాగా వ్యవహరించాలి. టిడిపి నేతలు ఏ స్థాయిలోనూ వైసిపి నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదు. నేను ఇలా చెబితే.. వైసిపికి ఓటేసిన వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లు ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదు. పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నాం. సంక్షేమ పథకాలు వేరు.. రాజకీయ సంబంధాలు వేరు. పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా చూసే బాధ్యత మంత్రులదే. జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు వారి జిల్లాల్లో పర్యటనల సంఖ్య పెంచాలి. కూటమిలోని మూడు పార్టీల నేతలు, కార్యకర్తలను కలుపుకొని ముందుకెళ్లాలి” అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

➡️