- లేకపోతే ‘చలో గుంటూరు’
- ఎపి కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానం
ప్రజాశక్తి – ఏలూరు : కోకో గింజల కొనుగోలు, ధరల సమస్యను వెంటనే పరిష్కరించకపోతే త్వరలో చలో గుంటూరు కార్యక్రమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన మంగళవారం జరిగింది. సమావేశంలో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ధర కోసం గత నెల రోజులుగా కోకో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారుల సమక్షంలో కంపెనీలతో చర్చలు జరిపినప్పటికీ కోకో గింజల కొనుగోలు, ధర సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర ఇస్తామని కంపెనీలు అంగీకరించాయని ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు చెప్పినా ఆచరణలో అమలు కావడం లేదని వివరించారు. రోజురోజుకీ ధరలను కంపెనీలు తగ్గిస్తున్నాయని, దీంతో కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కోకో రైతుల సంఘం ప్రతినిధి బృందం మార్చి 29న కలిసి వినతి పత్రం అందజేయగా రెండు, మూడు రోజుల్లో కంపెనీలతో జాయింట్ మీటింగ్ జరిపి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ప్రస్తుతం కిలో గింజలకు రూ.700కు పైగా ధర ఉందని తెలిపారు.. ప్రస్తుతం కంపెనీలు కిలోకు రూ.550 నుంచి రూ.500 ఇస్తున్నాయని, ఈ ధర మరింత తగ్గిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నాయని చెప్పారు. న్యాయం జరిగే వరకూ కోకో రైతులు ఐక్యంగా పోరాడుతారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ళ సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, ఉప్పల కాశీ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్, గుది బండి వీరారెడ్డి, కొసరాజు రాధాకృష్ణ, రాష్ట్ర కోశాధికారి జాస్తి కాశీ బాబు మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.