సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17వ పోలీస్ బెటాలియన్ లో కమాండెంట్ గా పనిచేసే తోట గంగారాం (58) ఘోర ప్రమాదానికి గురై మృతి చెందారు. సిరిసిల్లలో ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే గంగారాం రాత్రి డిన్నర్ చేశాక అర్ధరాత్రి బయటకు వెళ్లడానికి లిఫ్ట్ వద్ద వెయిట్ చేశారు. నిద్రమత్తులో లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లడంతో లిఫ్ట్ లో కిందికి పడ్డారు. మూడో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ పై బేస్ పై పడడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి లిఫ్ట్ అడుగు భాగంలో పడిపోయిన గంగారం అతి కష్టం మీద తీసి ఆసుపత్రికి తరలించే లోపే కమాండెంట్ ప్రాణాలు కోల్పోయారు. లిఫ్ట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కమాండెంట్ గంగారాం స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామం. మృతునికి భార్య రేఖ, ఒక కొడుకు సతీష్ కుమార్ ఇద్దరు కుమార్తెలు గౌతమి, మీనల్ ఉన్నారు. కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ మహేష్ బాబా సాహెబ్ గీతే పరామర్శించారు. పోస్టుమార్టం అనంతరం కమాండెంట్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. అపార్ట్ మెంట్ లో నాణ్యతలేని లిఫ్ట్ వల్లే పోలీస్ కమాండెంట్ ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లిఫ్ట్ రాకుండానే డోర్ ఓపెన్ కావడం బిల్డర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆందోళన వ్యక్తం అవుతుంది. నాణ్యత లేకుండా సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా అపార్ట్మెంట్ను నిర్మించి లిఫ్ట్ ఏర్పాటు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బిల్డర్ పై చర్యలు తీసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
