అకాల వర్షాలపై సమీక్షలో సిఎం ఆదేశం
ప్రతి రైతునూ ఆదుకుంటామని వెల్లడి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు, పిడుగుపాటుకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు నేటి (మంగళవారం) సాయంత్రంలోగా పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఉన్నత స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిహారం చెల్లించడంలో జాప్యం ఉండకూడదని, తక్షణమే చెల్లించాలని చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు. అనంతరం సిఎం మాట్లాడుతూ అనేక జిల్లాలకు అకాల వర్షాలు ఉన్నందున కలెక్టర్లు రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. పిడుగులు పడే ప్రాంతాల్లో రైతులకు మెసేజ్లు వెళ్లని పక్షంలో అధికారులు నేరుగా వెళ్లి అప్రమత్తం చేయాలని తెలిపారు. జిల్లాల్లో ఉన్న పరిస్థితులను బట్టి కలెక్టర్లు, దిగువ స్థాయి అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. విపత్తు సమయాల్లో అధికారులు మానవీయ కోణంలో ఆలోచించాలని, సహాయక చర్యలతోపాటు ఎటువంటి నష్టమూ వాటిల్లకుండా చూడాలని అన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టిజిఎస్లోని ఆవేర్ విభాగం నుండి ఎప్పటికప్పుడు వాతావరణం గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద మంచి యంత్రాంగం, సాంకేతికత ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. అధికారులు ఎంత అప్రమత్తంగా ఉంటే నష్టం అంత తక్కువగా జరుగుతుందని వివరించారు. అకాల వర్షాలకు ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను తక్షణం పునరుద్దరించడంలో కృషిచేసిన విద్యుత్శాఖ సిబ్బందిని సిఎం అభినందించారు. రబీలో 20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని పౌరసరఫరాల ప్రత్యేక కార్యదర్శి సౌరబ్గౌర్ సిఎంకు తెలపగా ఎక్కడా ధాన్యం కొనలేదనే మాటరాకూడదని తతెలిపారు. జిల్లా కలెక్టర్లు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని మరణాలు సంభవించకుండా చూడాలని పేర్కొన్నారు.
నష్టం ఎంతంటే…!
2224 హెక్టార్లలో వరి, మొక్కజన్న పంటలు దెబ్బతిన్నట్లు ఈ సమావేశంలో అధికారులు సిఎంకు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 15 మండలాల్లో 1033, నంధ్యాల జిల్లాలో 641, కాకినాడ జిల్లాలో 350, సత్యసాయి జిల్లాలో 20 హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని తెలిపారు. కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టిఆర్, తిరుపతి, నంధ్యాల, పశ్చిమగోదావరి జిల్లాల్లో 138 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు సిఎంకు వివరించారు.