కాంగ్రెస్‌ నాయకుడు దారుణ హత్య

  • స్కార్పియోను ట్రిప్పర్‌తో ఢీకొట్టిన, వేటకొడవళ్లతో నరికిన దుండగులు

ప్రజాశక్తి- గుంతకల్లు : కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి చిప్పగిరి లక్ష్మీనారాయణ (60) దారుణ హత్యకు గురయ్యారు. గుంతకల్లులోని ఆలూరు రోడ్డులో రైల్వే బ్రిడ్జి వద్ద మారణాయుధాలతో దుండగులు చేసిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ గతంలో ఎంఆర్‌పిఎస్‌ నాయకుడిగా ఉండేవారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు మద్దతుగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతరం ఆయన కాంగ్రెస్‌ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. లక్ష్మీనారాయణకు గుంతకల్లులో ఎక్కువ పరిచయాలు ఉన్నందున ఆయన ఆలూరులో కాకుండా ఎక్కువ శాతం గుంతకల్లులో ఉండేవారు. అక్కడ ఎల్లమ్మతగ్గు ఏరియాలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడి నుండి దళితుల సమస్యలపై పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన కుమారుడు వినోద్‌, తన అన్న కుమారుడు కరెంటు గోవిందులతో కలసి స్కార్పియోలో గుంతకల్లు నుంచి ఆదివారం మధ్యాహ్నం ఆలూరుకు బయలుదేరారు. గుంతకల్లు పట్టణ శివారులోని ఆలూరు రైల్వే బ్రిడ్జి వద్ద ముందుగానే కాపుకాసిన దుండగులు టిప్పర్‌తో ఆయన వాహనాన్ని ఢీకొట్టారు. అప్పటికే అక్కడ పొలాల్లో కాపుకాసిన కొందరు మారణాయుధాలతో విచక్షణారహితంగా లక్ష్మీనారాయణపై దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. వినోద్‌, గోవిందు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్య సమయంలో అక్కడి పొలాల్లో పనిచేస్తున్న కార్మికులు గట్టిగా కేకలు వేయడంతో తాము ప్రాణాలతో బయటపడ్డామని వినోద్‌, గోవిందు తెలిపారు. కాగా, 2006లో ఆలూరుకు చెందిన వైకుంఠం శ్రీరాములు హత్య కేసులో లక్ష్మీనారాయణ నిందితునిగా ఉన్నారు. శ్రీరాములుకు చెందిన వారే ఆయన హత్య చేసి ఉంటారని లక్ష్మీనారాయణ బంధువులు ఆరోపిస్తున్నారు.

➡️