- ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్
ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : ఉద్యోగుల అంతరాష్ట్ర్ర బదిలీలకు సంబంధించి తెలంగాణా రాష్ట్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ఈ విషయం తెలిపారు. శాశ్విత ప్రాతిపదికన ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి సిదంగా ఉన్న ఉద్యోగుల నుంచి సుముఖత కోసం రెండు ప్రభుత్వాలు సర్క్యులర్ జారీ చేశాయని చెప్పారు. 1947 మంది ఉద్యోగులు ఆంధ్రా నుంచి తెలంగాణాకు వెళ్లేందుకు, 1447 మంది తెలంగాణా నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నాని అన్నారు. తెలంగాణా ఉద్యోగులతో వన్టైం చర్యగా అంతర్రాష్ట్ర బదిలీకి సమ్మతి కోసం తెలంగాణా ప్రభుత్వాన్ని కోరామన్నారు. దీనిపై తెలంగాణా ప్రభుత్వం నుంచి సమాధానం రావాల్సి ఉందన్నారు. తెలంగాణా ప్రభుత్వం చేసిన అభ్యర్ధను పరిశీలించి 122 మంది తెలంగాణా స్థానిక నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగుల రిలీవ్కు చేయడానికి ఉత్తర్వులు ఇచ్చామన్నారు. వీరిలో 61 మంది తెలంగాణాలో చేరారని అన్నారు.
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ సమస్యలపై చర్చకు కమిటీలు
ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్య పెండింగ్లోని ద్వైపాక్షిక రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ సమస్యలపై చర్చకు మంత్రులు, సీనియర్ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. 2024 జులై 6వ తేదీన ఏపీ, తెలంగాణా ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఈ రెండు కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.