నిషేధిత జాబితాలో కొనసాగించడం సబబు కాదు

  • ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ల భూములపై హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి : ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు ప్రభుత్వం ఇచ్చే అసైన్‌మెంట్‌ భూమిని సదరు ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ క్రయ విక్రయాలు చేసేందుకు రూల్స్‌ అనుమతిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఆ భూమిని నిషేధిత భూముల జాబితా (22ఏ)లో కొనసాగించడం సబబు కాదని హైకోర్టు తీర్పు చెప్పింది. నిషేధిత భూముల జాబితా నుంచి తన భూమిని తొలగించాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను తిరుపతి జిల్లా కలెక్టర్‌ తిరస్కరించడాన్ని ఆక్షేపించింది. కలెక్టర్‌ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేసింది. పిటిషనర్‌ భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తక్షణమే తొలగించాలంటూ జస్టిస్‌ తూటా చంద్ర ధనశేఖర్‌ తీర్పు వెలువరించారు. ఎక్స్‌ సర్వీసెమెన్‌ కోటా కింద అసైన్మెంట్‌ కింద ఇచ్చిన భూమిని పదేళ్ల తర్వాత అమ్మేందుకు 1993లో జిఓ 1117 జారీ చేసిందని తెలిపారు. పిటిషనర్‌కు సంబంధించిన వ్యవహారంలో తహశీల్దార్‌ రిపోర్టు, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ సర్క్యులర్‌ను కలెక్టర్‌ పట్టించుకోలేదని తప్పుపట్టారు. దేశం కోసం సేవలు అందించిన మాజీ సైనికులకు పదేళ్ల తర్వాత భూమిని అమ్ముకునే హక్కు ఉందన్నారు.
తమ్మిశెట్టి బోదయ్య మద్రాసు రెజిమెంట్లో 15 ఏళ్లు పనిచేశారు. 1994లో అప్పటి నెల్లూరు జిల్లా, దొరవారిసత్రం మండలం, పూలతోట గ్రామంలో 3.5 ఎకరాల భూమిని ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా కింద బోదయ్యకు ఇచ్చారు. తన భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ బోదయ్య 2021లో దరఖాస్తు చేసుకుంటే ఆ తర్వాత ఏడాది జిల్లా కలెక్టర్‌ తిరస్కరిస్తూ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. దీనిని సవాల్‌ చేసిన కేసులో హైకోర్టు పైవిధంగా తీర్పు చెప్పింది.

➡️