భద్రత కల్పించడంలో కేంద్రం విఫలం

  • ఢిల్లీ తొక్కిసలాటపై సిపిఎం రాష్ట్ర కమిటీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : యాత్రికులకు భద్రత కల్పించడంలో నరేంద్ర మోడీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఎం రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో కుంభమేళాకు వెళ్తున్న ప్రయాణికులు 18 మంది మృతిచెందడం, అనేక మంది గాయపడటం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వరుసగా ప్రమాదాల్లో యాత్రికులు మరణించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం గర్హనీయమని పేర్కొన్నారు. మహా కుంభమేళాలో పాల్గొనమని ప్రజలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను మాత్రం గాలికొదిలేశాయని విమర్శించారు. ప్రమాద కారణాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర కమిటీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చనిపోయినవారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం యాత్రికుల భద్రతకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️