అమరావతి : వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని కాశీనాయన క్షేత్రానికి చెందిన స్నానపు గదులు, కుమ్మరుల, రజకుల అన్నదాన సత్రాన్ని, గోశాల గెస్ట్ హౌస్లను అటవీ శాఖ అధికారులు కూల్చివేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు గురువారం ప్రకటన విడుదల చేశారు. సామాన్యులు, పేదలు, యాత్రికుల ఆకలిని తీరుస్తున్న అన్నదానసత్రం, ఇతర వసతులపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం గర్హనీయం. 200 ఏళ్ళ చరిత్ర గలిగిన అన్నదాన సత్రాలను కాపాడి, అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి, సనాతన ధర్మం కాపాడతానని కంకణం కట్టుకున్న అటవీశాఖ మంత్రి పవన్కళ్యాణ్ తన శాఖ ఆధ్వర్యంలోనే కూల్చివేతలకు పాల్పడడం దారుణం. అటవీ శాఖ పరిధి నుండి ఆ ప్రాంతాన్ని మినహాయించి ప్రభుత్వం తన నిధులతో అన్నదాన సత్రాలను, ఇతర వసతులను పునర్నిర్మించాలని కోరుతున్నది. ఈ అక్రమ కూల్చివేతలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నట్లు శ్రీనివాసరావు ప్రకటనలో పేర్కొన్నారు.
కాశీనాయన క్షేత్ర అన్నదాన సత్రం, గోశాల గెస్ట్ హౌస్ల కూల్చివేతను ఖండించిన సిపిఎం
