ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : విశాఖ డెయిరీ యాజమాన్యం ఏకపక్షంగా పాల అమ్మకపు ధరను లీటరుకు రూ.2 పెంచేసి శనివారం నుంచి అమల్లోకి తీసుకురావడాన్ని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. తక్షణమే రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకొని పెంచిన పాల ధరను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత వైసిపి ప్రభుత్వం ఏడాది క్రితం లీటర్ పాల అమ్మకపు ధరను రూ.2 పెంచేసిందన్నారు. అప్పుడు ఈ పెంపుదలను టిడిపి, జనసేన, బిజెపిలు తీవ్రంగా వ్యతిరేకించాయని గుర్తు చేశారు. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చినా ఆ ధరను తగ్గించకపోగా ఏడాది గడవక ముందే మరో రూ.2లను లీటర్కి పెంచి ప్రజలపై భారాలు వేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. మరోపక్క రైతులకు ఇచ్చే లీటర్ పాల సేకరణ ధరను రూ.3 తగ్గించిన విషయాన్ని జగ్గునాయుడు గుర్తు చేశారు. ప్రస్తుతం రైతుల నుంచి సేకరించే లీటరు పాల సేకరణ ధరకు, వినియోగదారులకు విశాఖ డెయిరీ అమ్మే ధరకు రూ.20 వ్యత్యాసం ఉంటోందని తెలిపారు. తాజా పెంపుదల వల్ల ప్రజలపై రూ.6 కోట్ల భారం పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆస్తి పన్ను, విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచేశారని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయని పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు, విద్య, వైద్య ఖర్చులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయని తెలిపారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అటువంటివారిపై పాల ధరను పెంచి మరో భారం మోపడం తగదని పేర్కొన్నారు.
