- పోలవరం పరిహారం పై సిపిఎం తీవ్ర అభ్యంతరం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఎప్పుడో నిర్ణయించిన పాత రేట్లను కొన్ని ప్రాంతాల్లో నిర్వాసితులకు ప్రభుత్వం ఇస్తోంది. నిర్వాసితుల అభిప్రాయం తీసుకోకుండా, వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా బ్యాంకుల్లో ఆ మొత్తాన్ని జమచేస్తోంది. ప్రభుత్వ చర్య పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ బ్యాంకు ఖాతాల్లో పాత రేట్లను జమ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది’అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2015లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.6.86లక్షలుగా ప్యాకేజిని ప్రకటించిందని ఆయన తెలిపారు. 2022లో సిపిఎం , ప్రజల ఆందోళనతో జగన్ ప్రభుత్వం ప్యాకేజీని రూ.10లక్షలకు పెంచిందన్నారు. కానీ గత, ప్రస్తుత ప్రభుత్వాలు పెంచిన దాన్ని అమలు చేయకుండా అన్యాయం చేశాయని పేర్కొన్నారు. అలాగే 41.75 మీటర్ల వద్ద అశాస్త్రీయంగా నిర్ణయించిన కాంటూరు లెక్కల ప్రకారం కొద్ది గ్రామాలకే పరిహారం ఇవ్వడాన్ని కూడా సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. 2021-22 వరదల ప్రాతిపదికగా కాంటూరు లెక్కలను తాజాగా లెక్కలు వేసి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 2013 భూసేకరణ చట్టం, ఆదివాసీ హక్కులచట్టాల ప్రకారం , పెరిగిన ధరలకు అనుగుణంగా పరిహారం చెల్లించడంతో పాటు పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాతే డ్యామ్ పనులు చేపట్టాలని, ఆ లోగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని సిపిఎం కోరతున్నట్లు ఆయన తెలిపారు.