నేటి నుంచి తిరుపతిలో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు

  • హాజరుకానున్న సిపిఎం అగ్రనేతలు ఎంఎ బేబీ, బివి రాఘవులు

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ : తిరుపతిలో ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతాయని, ఈ సమావేశాలకు సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరవుతున్నారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి నాగరాజు తెలిపారు. యశోదానగర్‌లోని వేమన విజ్ఞాన కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో పాతికేళ్ల తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా 8న రాష్ట్ర కార్యదర్శివర్గం సమావేశం జరగనుందని, అదే రోజు సాయంత్రం 3.30 గంటలకు ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి విగ్రహం నుంచి భారీ ప్రజాప్రదర్శన జరుగుతుందని, తర్వాత కచ్చిపి ఆడిటోరియంలో సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభను ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టిడిపి కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పేదల సమస్యలు పరిష్కారం కావడం లేదని, దందాలు పెరిగాయని, అవినీతి విచ్చలవిడిగా ఉందని వీటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు టి సుబ్రమణ్యం, ఎస్‌ జయచంద్ర, ఆర్‌ లక్ష్మి, పి సాయిలక్ష్మి, మాధవ, పి వేణు గోపాల్‌, రవి పాల్గొన్నారు.

➡️