- రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం విజ్ఞప్తి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మూడు రోజులుగా శ్రీకాకుళం నుండి కృష్ణా జిల్లా వరకూ కురుస్తున్న భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే యుద్ధప్రాతిపదికన రక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడి వేలేరుపాడు మండలం మొత్తం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణా రాష్ట్రంలో అశ్వారావుపేట మండలంలో ఉందని, ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాలు ఎపిలోని వేలేరుపాడు మండలంలో ఉన్నాయని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాలను గత ఐదేళ్లుగా పాలించిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పెద్దవాగుకు గండిపడిందని తెలిపారు. ఉభయ రాష్ట్రాల ఉమ్మడి అంశాల ఆస్తుల విషయంలో జరిగిన తాత్సారమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. 15 గ్రామాల్లో జనావాసాలు నేలమట్టం అయ్యాయని, వందలాది పశువులు, మృత్యువాత పడ్డాయని పేర్కొన్నారు. కరెంటు స్తంభాలు పడిపోయి, గ్రామాల మధ్య రహదారులు గండ్లు పడి ఆ మండలం మొత్తానికి ఇతర ప్రాంతాలతో అన్ని సంబంధాలు తెగిపోయాయని తెలిపారు. బాధిత ప్రజలు నిస్సహాయులుగా ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే వారికి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించాలని కోరారు. రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, కోనసీమ, ఎన్టిఆర్, కృష్ణా జిల్లాల్లో వాగులు ఏరులు పెద్దఎత్తున ప్రవహిస్తున్న ఫలితంగా గండ్లు పడి వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయని తెలిపారు. గోదావరి, శబరి, సీలేరు నదుల వరద తాకిడితో పరిసరాల్లో ఉన్న వందలాది గ్రామాల్లో మునక భయంతో ప్రజలు మెరక ప్రాంతాలకు వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారని పేర్కొన్నారు. విలీన మండలాల్లో తక్షణం యుద్ధ ప్రాతిపదికన వరద ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయిలో బాధిత ప్రజలకు రక్షణ, సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ జిల్లాలన్నిటా పార్టీ శ్రేణులు వెంటనే పర్యటనలు చేయాలని, బాధిత ప్రజలకు సహాయక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. వరద నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం నేతృత్వంలో సిపిఎం బృందం ఆదివారం వరద ప్రాంతాల్లో పర్యటించనుందని తెలిపారు.