- విభజన చట్టం అమలుపై స్పందించాలి
- సిపిఎం డిమాండ్
- మోడీకి బహిరంగ లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను అప్పు రూపంలో కాకుండా గ్రాంటుగా ప్రకటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభానికి మే 2న విచ్చేస్తున్న సందర్భంగా ప్రధాని మోడీకి సిపిఎం రాష్ట్ర కమిటీ బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వర రావు, సిహెచ్ బాబూరావు విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో ఆదివారం విడుదల చేశారు. అనంతరం వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో రాష్ట్ర రాజధాని విషయంలో బిజెపి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేసిందని విమర్శించారు. రాజధాని బాధ్యత కేంద్రానిదే అని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా, కేవలం రూ.1,500 కోట్లు కేటాయించింద న్నారు. ప్రపంచ బ్యాంకు, హడ్కోల నుంచి రూ.31 వేలకోట్లు అప్పు రూపంలో ఇప్పిస్తామని ప్రకటన చేశారని, ఇందులో కేంద్రం గ్రాంటు కేవలం రూ.1,400 కోట్లు అని తెలిపారు. రూ.లక్ష కోట్లతో రాజధాని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని, వీటిల్లో కేంద్రం ఎంత ఇస్తుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. దీనిపై బహిరంగంగా ప్రధాని మోడీ ప్రకటన చేయాలని కోరారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి 2015లో విచ్చేసిన నరేంద్ర మోడీ ఆర్భాటంగా నీళ్లు, మట్టి తెచ్చి ఎంతో గొప్పగా చెప్పారని అన్నారు. మళ్లీ పనులు పున:ప్రారంభానికి మోడీ వస్తుండటంతో ప్రజల్లో అనేక సందేహాలు, అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. అప్పులు, వడ్డీల రూపంలో ఇచ్చే నిధులను ప్రజలే చెల్లించాల్సి ఉంటుందని, భవిష్యత్తులో ఇది భారంగా మారుతుం దని ఆందోళన వ్యక్తం చేశారు. కడప స్టీల్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి నిధుల కేటాయింపుల పైనా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాజధానికి మరలా మరో 44 వేల ఎకరాలు భూసమీకరణ విధానంలో సేకరిస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటనలు చేస్తుండటంతో రైతులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తొలిదశలో భూములిచ్చిన రైతులు, కూలీల సమస్యల పరిష్కారానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ.. పదేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి రాజధానికి రావాల్సిన నిధులు కోరడంలో, పొందడంలో, ఒత్తిడి చేయడంలో విఫలమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో డబుల్, త్రిబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అని చెబుతున్న చంబ్రాబు, పవన్ కల్యాణ్ మాటల్లో కాకుండా చేతల్లో నిధులు సాధించాలని, ఆ మేరకు కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. 41 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 300 ఎకరాలకు పైగా స్థలాలు కేటాయించారని, వీటి నిర్మా ణాలను ఆరు నెలల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేశా రు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే రీతిలో మోడీ వ్యవహరించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వై నేతాజీ, రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి పాల్గొన్నారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు
అనుచిత వ్యాఖ్యలు సరికావు
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు సిపిఎంపైన, పార్టీ కార్యదర్శిపైన చేసిన అనుచిత వ్యాఖ్యలను బాబూరావు ఖండిరచారు. ఉండి నియోజకవర్గంలో సుమారు 900 ఇళ్లను కూల్చేయడంతో పేదలు రోడ్డున పడ్డారని, వీటిని తానే కూల్చినట్లు రఘురామ కృష్ణరాజు ప్రకటించారని తెలిపారు. కూల్చివేతలకు నిరసనగా ఆందోళనలు చేస్తున్న పేదలకు తమ పార్టీ అండగా నిలబడిరదన్నారు. ఇళ్లను కూల్చడాన్ని ప్రశ్నిస్తే ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఆయన అసభ్య, అనుచిత పదజాలంతో దుర్భాషలకు దిగారని చెప్పారు. తాము సభ్యతగా వ్యవహరిస్తామని టిడిపి చెప్పిందన్నారు. ఆ పార్టీకి చెందిన రఘురామ కృష్ణరాజు అనుచిత వాఖ్యలపై స్పందించి, అదుపు చేయాల్సిన బాధ్యత టిడిపి అధినాయకత్వంపై ఉందన్నారు. ఇళ్లు తొలగింపులు ఆపి పేదలకు న్యాయం చేయాలని కోరారు.