- వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) : అన్నమయ్య జిల్లా ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని, పునరావాసం కల్పించాలని, లీజు బకాయిల చెల్లించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలోని సిసిఎల్ఎ కార్యాలయం వద్ద నిర్వాసితులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అనంతరం సిసిఎల్ఎ అడిషనల్ కమిషనర్ ఎన్.ప్రభాకర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుంటే జూన్ 12న నిరవధిక దీక్ష చేస్తామని, న్యాయం కోసం కోర్టుకు వెళతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 1200 ఎకరాల్లో మూడు పంటలను పండించి 300 మంది రైతులు ఆదాయం పొందేవాళ్లన్నారు. వైసిపి ప్రభుత్వం రిజర్వాయర్ కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుందని, ఎకరాకు రూ.12 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులను కూడా అమలు చేయలేదని తెలిపారు. ప్రస్తుతం అధికార కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 2013 భూ సేకరణ చటం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు, ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితుల సంఘం నాయకులు ఆర్ రాజేష్, సి శ్రీనివాసులు, ఆర్ శ్రీనివాసులు, ఆర్ లక్ష్మీదేవి, సి కుమారి, ప్రసాద్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.