పేదల గుడిసెలను తొలగించిన డిప్యూటీ కలెక్టర్‌కు ఎంఆర్‌ఒగా డిమోషన్‌

సుప్రీం సంచలన తీర్పు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి పేదల గుడిసెలను తొలగించిన డిప్యూటీ కలెక్టర్‌ తాతా మోహన్‌రావు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని జిఎడిలోని డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో ప్రొటోకాల్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను ఎంఆర్‌ఒగా డిమోషన్‌ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గుంటూరు తహశీల్దార్‌గా పనిచేసిన మోహన్‌రావుకు గుంటూరులోని ఒక ప్రాంతంలో గుడిసెలను తొలగించవద్దని 2013 డిసెంబర్‌ 11న హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలను ఉల్లంఘించి 2014 జనవరిలో బలవంతంగా గుడిసెలను తొలగించారు. ఉద్దేశపూర్వకంగా ఉత్తర్వులను పాటించకపోవడంతో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన మోహన్‌రావుకు రాష్ట్ర హైకోర్టు రెండు నెలల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పుపై డిప్యూటీ కలెక్టర్‌ మోహన్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బిఆర్‌ గవాయ్, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మాసిహ్ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘అధికారులు తాము చట్టానికి అతీతులమన్న భావన కలిగి ఉండకూడదు. ఒకసారి కోర్టు హెచ్చరించింది. అయినా తిరిగి అదే చర్య చేశారు. ఆయనను ఎలా క్షమించాలి. ఆయన హైకోర్టు కన్నా పెద్దవాడని అనుకుంటున్నారు. ఎన్ని కుటుంబాలను ఖాళీ చేయించారు. 80 మంది పోలీసులతో వెళ్లి హైకోర్టు ఆదేశాల్ని విస్మరించారు. ఆయన 48 గంటలు కస్టడీలో ఉంటే ఉద్యోగం పోతుంది’ అంటూ జస్టిస్‌ గవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అధికారికి హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత ఉందని తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ‘ఆయన ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నారనేది స్పష్టంగా ఉంది. మీరు ఎంత ఉన్నత పదవిలో ఉన్నా… కోర్టు ఆదేశాలను ధిక్కరించకూడదు అనే సందేశం దేశవ్యాప్తంగా వెళ్లాలని కోరుకుంటున్నాం’ అని జస్టిస్‌ గవాయ్ అన్నారు. డిప్యూటీ కలెక్టర్‌ కొంతకాలం ప్రభుత్వ అతిథిగా ఉండాలని వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన మోహన్‌రావుపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సిఎస్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. డిప్యూటీ కలెక్టర్‌కు ఇద్దరు చిన్న పిల్లలున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే జోక్యం చేసుకున్న న్యాయమూర్తి గవారు, ఆయన ఎన్నో కుటుంబాలను ఖాళీ చేయించారని, వారి పిల్లలు ఏమవుతారు అని ప్రశ్నించారు. ‘పిటిషనర్‌ గుడిసె వాసుల ఇళ్లను కూల్చివేసి రోడ్డుపై పడేసినప్పుడు ఇవన్నీ ఆలోచించి ఉండాలి. ఆయన ఇప్పుడు మానవీయ వైఖరిని ఆశిస్తే, ఆయన అమానుషంగా ప్రవర్తించకూడదు. ఆయన ప్రవర్తనలో మానవీయ దృక్పథం లేదు. మేము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఉండేవాళ్లం. చట్టం గొప్పతనం శిక్షించడంలో కాదు, క్షమించడంలో ఉంది అని మాకు గుర్తు చేస్తోంది. పిటిషనర్‌ ఎటువంటి దయగల విధానానికి అర్హులు కాదని భావిస్తున్నాం. పిటిషనర్‌ మొండి, నిర్దయాత్మక వైఖరి కారణంగా ఆయన పిల్లలు, కుటుంబం బాధపడకూడదని మేము అనుకుంటున్నాం’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది.

➡️