విశాఖ కాలుష్య నివారణకు చర్యలు.. డిప్యూటీ సీఎం

అమరావతి : విశాఖపట్నంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌  శాసన మండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. విశాఖ కాలుష్య నివారణకు, పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాలుష్య నివారణ చేపడతాం. పలాస జీడిపప్పు తొక్క కాల్చడం ద్వారా కూడా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువ డేది.. కానీ, ఇప్పుడు ఆ జీడిపప్పు తొక్క ద్వారా ఆయిల్ సేకరించి ఆదాయం సమకూర్చుతున్నామని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలలో కాలుష్యానికి కారణమయ్యే బొగ్గు వాడకాన్ని కూడా తగ్గిస్తున్నామని పవన్ కల్యాణ్  తెలిపారు.

అయితే, కొన్ని దశాబ్దాలుగా  పరిశ్రమల అభివృద్ధితో విశాఖలో కాలుష్యం పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా, విశాఖను కాలుష్యానికి దూరంగా ఉంచేలా ప్రయత్నిస్తాం అని అన్నారు. గత ప్రభుత్వం కాలుష్య నివారణకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అయితే, తమ ప్రభుత్వం గాలిలో నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. కాలుష్యం ఏ అభివృద్ధికి అయినా ఆటంకం కలిగిస్తోంది. కాలుష్యం లేని అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

➡️