రొళ్ల (శ్రీసత్యసాయి) : శ్రీసత్యసాయి జిల్లాను అతిసార వ్యాధి వణికిస్తోంది… 4 రోజుల్లో ఒకే గ్రామంలోని ముగ్గురు అతిసార బారినపడి మృతి చెందడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రొళ్ల మండలం ఎం.రాయపురం గ్రామంలో అతిసారం విజృంభిస్తుంది. నాలుగు రోజుల వ్యవధిలోనే గ్రామానికి చెందిన రత్నాచారి, పార్వతమ్మ, హనుమంత రాయప్పలు మఅతి చెందారు. గత శనివారం నుంచి గ్రామంలో పలువురు విరేచనాలు, వాంతులు చేసుకుంటూ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో డీఎం అండ్ హెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకుని, చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పాఠశాలల్లోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక అతిసారంతో శనివారం నుంచి బెంగుళూరు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రత్నాచారి (65), పార్వతమ్మ (54)లు సోమవారం రాత్రి చనిపోయారు. శిరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హనుమంత రాయప్ప (75) అనే వృద్ధుడు మంగళవారం మృతి చెందాడు. ఇలా ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం భయందోళనలకు కారణమవుతోంది. గత వారంలో నియోజకవర్గంలోని కొంకలు గ్రామంలో అతిసారం లక్షణాలతో మరణాలు మరవకముందే, తిరిగి రాయపురంలో అతిసారం ప్రబలడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ గ్రామంలో పర్యటించి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీనిలో భాగంగా నీటి బోరు వద్ద పైప్ లైన్ లీకేజీ నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు.
