- విద్యుత్ శాఖ మంత్రి ప్రకటనపై సిపిఎం రాష్ట్రకమిటీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అవాస్తవాలతో అసెంబ్లీని, ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దని సిపిఎం రాష్ట్రకమిటీ డిమాండ్ చేసింది. తమ కూటమి అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచలేదని శాసనసభలో ఆ శాఖమంత్రి జి రవికుమార్ శుక్రవారం శాసనసభలో అవాస్తవాలు చెప్పడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టిడిపి కూటమి అధికారానికి వచ్చిన తరువాతనే రెండు పర్యాయాలు ట్రూఅప్, ఎఫ్పిపిసిఎ పేరుతో సుమారు రూ.16వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేసిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. అంతేగాక గత వైసిపి సర్కార్ యూనిట్కు ఆరు పైసలుగా ఉన్న విద్యుత్ సుంకాన్ని ఏకంగా రూపాయికి పెంచితే దానికి చట్టబద్ధత కల్పించింది కూటమి ప్రభుత్వమేనని వివరించారు. ఇప్పటికీ ప్రతి నెల ప్రతి యూనిట్కు 40పైసల చొప్పున ఎఫ్పిపిసిఎ చార్జీలను అదనంగా వసూలు చేస్తున్నది కూటమి సర్కారే కదా అని తెలిపారు. ప్రజలపై గత ప్రభుత్వం వేసిన భారాలను కొనసాగిస్తూ, ఇంకొన్ని కొత్త భారాలను మోపుతూనే నిండు శాసనసభలో మంత్రి అలా ప్రకటించడం సభను, రాష్ట్రప్రజలను తప్పుదారి పట్టించడమేనని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తామని కూటమి మేనిఫెస్టోలో హామీనిచ్చారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఉపన్యాసించిన భారీ ఎన్నికల సభల్లో ఇదే విషయం గట్టిగా చెప్పారని గుర్తుచేశారు. వైసిపి పాలనలో రకరకాల పేర్లతో వేసిన వేల కోట్ల రూపాయల భారంతో బాధపడుతున్న రాష్ట్రప్రజలు చంద్రబాబు మాటతో ఊరట చెందారని తెలిపారు. రానున్న ఐదేళ్లూ కరెంట్ చార్జీలు పెరగవని భావించారని తెలిపారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు సార్లు ఎఫ్పిపిసిఎ చార్జీల భారం మోపిందని గుర్తుచేశారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రూ.6,072.86కోట్ల ఎఫ్పిపిసిఎ ఛార్జీల భారం మోపుతూ 2024 అక్టోబర్ 25వ తేదిన ఎపిఇఆర్సి ఉత్తర్వులు విడుదల చేసిందని తెలిపారు. 2024 నవంబర్ నుంచి 2026 జనవరి వరకు వీటిని వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రూ.9,412కోట్ల ఎఫ్పిపిసిఎ చార్జీల భారం మోపుతూ 2024 నవంబర్ 29వ తేదిన ఎపిఇఆర్సి ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు. 2024 డిసెంబర్లో మొదలైన వసూలు 2026 నవంబర్ వరకూ కొనసాగుతుందని వివరించారు. రెండింటికి అదనంగా నెలనెలా ఎఫ్పిపిసిఎ చార్జీ యూనిట్కు 40 పైసలు వసూలు చేస్తున్నారని తెలిపారు.ఈ భారాలు టిడిపి కూటమి వేసినవేనని తెలిపారు. ఎస్సి,ఎస్టిలకు 200 యూనిట్లలోపు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పినా చాలాచోట్ల అమలు కావడం లేదని, బకాయిల పేరుతో వేల రూపాయలు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వం తప్పుడు విద్యుత్ ఒప్పందాలు చేసుకొని రూ.1.80లక్షల కోట్ల భారాన్ని వేసిందని టిడిపి కూటమి సర్కారు శ్వేతపత్రంలో పేర్కొన్నా, మాట మార్చి ఆ భారాన్ని జనంపై మోపడం వాస్తవం అవునా? కాదా చెప్పాలని కోరారు. చార్జీలు పెంచేది లేదని తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నెలనెలా పెరుగుతున్న కరెంట్ బిల్లులు చెల్లిస్తూ ఉసూరుమంటున్న వినియోగదార్లు ప్రభుత్వ అబద్ధాలను నమ్మబోరని తెలిపారు. గత ప్రభుత్వం అదాని కంపెనీతో చేసుకున్న అవినీతికరమైన సెకి విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయకుండా టిడిపి కూటమి సర్కారుకు జగన్ ప్రభుత్వానికి తేడా లేదని రుజువు చేసిందని విమర్శించారు. అదాని అవినీతిని కప్పిపుచ్చడానికి మోడీ, జగన్, చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. స్మార్ట్ మీటర్ల విషయంలోనూ కూటమి సర్కారు మాట తప్పిందని విమర్శించారు. వాగ్దానాలను విస్మరించడమే గాక ప్రజలకు అబద్ధాలు చెబుతూ మోసగించి ఎల్లకాలం పాలన సాగించలేరని తెలిపారు. విద్యుత్ భారాలు మోస్తున్న ప్రజలు తప్పక ప్రతిఘటిస్తారని, ప్రభుత్వానికి బుద్ధి చెప్పక మానరని పేర్కొన్నారు.