ఎంపి తనుజారాణి -అరకువ్యాలీలో పాస్ పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభం
ప్రజాశక్తి- అరకులోయ : పర్యాటక కేంద్రమైన అరకులోయలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని అరకు ఎంపీ గుమ్మ తనుజరాణి అన్నారు.అరకులోయ పోస్ట్ ఆఫీస్ సముదాయంలో బుధవారం పాస్ పోర్ట్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అరకులోయ దిన దినం అభివృద్ధి చెందుతుందని, గతంలో మామూలు రోడ్డు ఉండేదని ఇప్పుడు హైవే రోడ్డు వచ్చిందన్నారు. అలాగే డబల్ రైల్వే ట్రాక్ వచ్చిందని ఆమె అన్నారు. పాస్ పోర్ట్ కోసం సుదూర ప్రాంతమైన విశాఖపట్నంకి వెళ్లే వారమని, ఇప్పుడు అరకులోనే అందుబాటులోకి పాస్ పోర్ట్ కేంద్రం రావడం హర్షణీయమన్నారు. అరకులోయకు దేశ విదేశాల పర్యాటకులు ఇక్కడికి సందర్శిస్తున్న దృష్ట్యా భవిష్యత్తులో అరకులోయలో ఎయిర్ పోర్ట్ కూడా అవసరం ఉందని, ఇందుకు ఎంపీగా తాను తన వంతు కృషి చేస్తానన్నారు.పాస్ పోర్ట్ సేవ కేంద్రాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం మాట్లాడుతూ, గతంలో పాస్ పోర్ట్ పొందడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లి అనేక అవస్థలు పడేవారని, ఇప్పుడు మన ముంగిట రావడం ఆనందదాయక మన్నారు. రీజనల్ పాస్పోర్ట్ అధికారి కె.ఎస్ భాస్కరరావు మాట్లాడుతూ, అరకులో రోజుకు 40 స్లాట్ బుకింగ్ కు అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో స్లాట్ బుకింగ్ పెంచుకునే అవకాశం కూడా ఉందన్నారు. పాస్ పోర్ట్ పొందడానికి ఏజెంట్లను ఆశ్రయించవద్దని ఆయన కోరారు. అరకు సేవా కేంద్రంలో సులభతరంగా పాస్ పోర్ట్ పొందవచ్చు అన్నారు.విశాఖపట్నం పోస్ట్ మాస్టర్ జనరల్ విన్నం ఉపేంద్ర మాట్లాడుతూ, అరకులో పాస్ పోర్ట్ సేవ కేంద్రం ఏర్పాటు చేయడం అపూర్వమైన ఘట్టమన్నారు.పాస్ పోర్ట్ జాయింట్ సెక్రటరీ కేజే శ్రీనివాస్ మాట్లాడుతూ, అరుకు ప్రాంత ప్రజలు పాస్పోర్ట్ సేవా కేంద్రం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.అనంతరం పలువురికి పాస్ పోర్ట్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, అనకాపల్లి పోస్టల్ ఎస్పీ నాగేశ్వరరెడ్డి, పాస్పోర్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ కె.వి. డి.సాగర్, తహసిల్దారు ఎం. వి.వి.ప్రసాద్, అరకులోయ సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమగిరి, పెద్దలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ పెట్టేలి దాసుబాబు, పోస్టల్ ఐపివోలు లక్ష్మి కిషోర్, ఉపేందర్, ప్రముఖ వ్యాపారవేత మయూరి రాజారావు పాల్గొన్నారు.