ఏపీలో ఎండా… వాన…

మంగళగిరి:  భిన్న వాతావరణ పరిస్థితుల్లో గురువారం రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. మరోవైపు రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు 40°C – 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని, శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 28 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి అంబేద్కర్ కోనసీమ జిల్లా మధ్యకొంపలులో 86మిమీ, రామచంద్రపురంలో 73.5మిమీ, కొత్తపేటలో 64.5మిమీ, శ్రీకాకుళం జిల్లా నివగాంలో 52మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 48.7మిమీ, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 44 మిమీ, తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో 42.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.
బుధవారం వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 40.7°C, నంద్యాల జిల్లా గుల్లదుర్తి, కర్నూలు జిల్లా నేమకల్లులో 40.6°C, పల్నాడు జిల్లా కాకానిలో 40.2°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.
ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు.
➡️