ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రథసప్తమి వేడుకకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో సప్తమినాడు శ్రీ మలయప్పస్వామివారు 7 ప్రధాన వాహనాలపై ఊరేగిస్తారు. వాహనసేవలు తిలకించేందుకు వేలాదిగా యాత్రికులు తరలివస్తారు. వాహనసేవలను తిలకించేందుకు వీలుగా ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ మాడ వీధులను రంగవళ్లులతో అందంగా తీర్చిదిద్దారు. ఎండలో నడిచేందుకు ఇబ్బంది పడకుండా వైట్ పెయింట్ వేశారు. యత్రికులకు భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు, ఎస్పిఎఫ్ సిబ్బంది, ఎన్సిసి క్యాడెట్లు సేవలందిస్తారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో యాత్రికులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులకు విధులు కేటాయించారు. యాత్రికులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు గ్యాలరీల్లో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.
