ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్)లో ప్రత్యేక అధికారి (పర్సన్ ఇన్ఛార్జి) పాలన మరో ఆరు నెలలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2025 జనవరి 18 నుంచి జులై 17 వరకూ పర్సన్ ఇన్ఛార్జి పాలన పొడిగించినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డిసిసిబి)ల్లో పర్సన్ ఇన్ఛార్జి పాలనను కూడా ప్రభుత్వం పొడిగించింది. ఇందుకు స్పెషల్ సిఎస్ శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. కృష్ణా, ప్రకాశం, కడప, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం మొత్తం 13 జిల్లాల్లో ఉన్న డిసిసిబిల పర్సన్ ఇన్ఛార్జుల పాలనను ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టే వరకూ పొడిగిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
