రాజధానికి భూములిచ్చిన రైతులు ఆందోళన చెందవద్దు : మంత్రి కె.నారాయణ

  • రాజధానిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు
  • పురపాలక,పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కె నారాయణ

ప్రజాశక్తి – తుళ్లూరు (గుంటూరు) : రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కె.నారాయణ అన్నారు. అమరావతి పై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దని అన్నారు. స్మార్ట్‌ ఇండిస్టీస్‌ ఏర్పాటు కోసం విదేశీ ప్రతినిధులు రావాలంటే ఎయిర్‌ పోర్ట్‌ అవసరం అని చెప్పారు. అమరావతిలో ఎయిర్‌ పోర్టు నిర్మాణం, 30 వేల ఎకరాల భూ సమీకరణ పై రైతులకు మంత్రి మరోసారి స్పష్టత నిచ్చారు. పరిశ్రమలు వస్తేనే రైతుల భూముల ధరలు నిలుస్తాయనీ, పెరుగుతాయని అన్నారు. ఎయిర్‌ పోర్ట్‌ కోసం భూసేకరణకు బదులు సమీకరణే చేయాలని ఎమ్మెల్యేలు కోరారని ఆయన తెలిపారు. రైతులకిచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. బుధవారం సచివాలయంలో మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రైతుల త్యాగంతోనే అమరావతి నిర్మాణం చేస్తున్నామన్నారు. అమరావతి నిర్మాణం అంటే కేవలం మౌలిక వసతుల కల్పన మాత్రమే కాదని, జనాభా రావాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా స్మార్ట్‌ ఇండిస్టీస్‌ ఏర్పాటు జరగాలన్నారు. రైతుల భూముల ధరలు నిలవాలన్నా, ధరలు పెరగాలన్నా పరిశ్రమల ఏర్పాటు ముఖ్యమన్నారు. అమరావతిలో కాలుష్య భరితమైన పరిశ్రమలు కాకుండా స్మార్ట్‌ ఇండిస్టీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి తెలిపారు. స్మార్ట్‌ ఇండిస్టీస్‌ ఏర్పాటు కోసం విదేశీ పెట్టుబడిదారులు అమరావతికి రావల్సి ఉంటుందని, అందుకోసమే ఫ్లైట్‌ కనెక్టవిటీ ఉండేలా ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు 5 వేల ఎకరాల భూమి అవసరం అన్నారు. అయితే దీనికోసం భూసేకరణ చేయాలా, ల్యాండ్‌ పూలింగ్‌ చేయాలా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటికే అమరావతిలో 64 వేల కోట్ల పనులకు పరిపాలనా ఆమోదం లభించిందని, చాలా వరకూ టెండర్లు పూర్తయి పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు.

➡️