- నూతన విధానాన్ని ప్రవేశపెట్టిన టిటిడి
ప్రజాశక్తి- తిరుమల : యాత్రికులకు మెరుగైన సేవలందించేందుకు టిటిడి ఓ కొత్త ఫీడ్బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై యాత్రకులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా తెలియజేయవచ్చు. తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లను మొబైల్తో స్కాన్ చేస్తే వాట్సాప్లో టిటిడి అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాత్రికులు తమ పేరు, విభాగాన్ని (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు మొదలైనవి) ఎంచుకోవాలి. అనంతరం అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మేట్ను ఎంచుకోవచ్చు. సేవా ప్రమాణాన్ని ఉత్తమం, సగటు/మరింత మెరుగుదల అవసరం, లేదా బాగాలేదుగా గుర్తించాల్సి ఉంటుంది. యాత్రికులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు. లేదా వీడియోగా అప్లోడ్ చేయవచ్చు. అభిప్రాయం సమర్పించిన వెంటనే, ‘మీ అభిప్రాయం విజయవంతంగా నమోదు చేయబడింది. మీ విలువైన ఫీడ్బ్యాక్కు ధన్యవాదాలు”అనే ధ్రువీకరణ సందేశం వస్తుంది. ఈ విధానం శుక్రవారం నుంచి అమలులోకి వచ్చిందని, యాత్రికుల నుండి అందిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సేవల ప్రమాణాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని టిటిడి పేర్కొంది.