– జిందాల్ జెఎసి నాయకుల ఆధ్వర్యాన పాదయాత్ర, రాస్తారోకో
ప్రజాశక్తి- కొత్తవలస (విజయనగరం) :జిందాల్ పరిశ్రమలో లే ఆఫ్ ఎత్తివేసి కార్మికులందరికీ భేషరతుగా పని కల్పించాలని జిందాల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ల జెఎసి నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరంలో జిందాల్ గేటు నుంచి నిమ్మలపాలెం, అడ్డుపాలెం, తుమ్మకాపల్లి మీదుగా కొత్తవలస జంక్షన్ వరకు జెఎసి ఆధ్వర్యాన శుక్రవారం కార్మికులు పాదయాత్ర చేశారు. అనంతరం కొత్తవలస అంబేద్కర్ జంక్షన్లో రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఎపి ఫెర్రో ఎల్లాయిస్ వర్కర్స్ కో ఆర్డినేషన్ కమిటీ (సిఐటియు) రాష్ట్ర కన్వీనర్ టివి రమణ, వైఎస్ఆర్ టియుసి నాయకులు నెక్కల నాయుడుబాబు మాట్లాడుతూ గత 40 ఏళ్ల నుంచి కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకొని, చివరికి జిందాల్ యాజమాన్యం బయటికి నెట్టిందన్నారు. కార్మికులు వేతనాలు, అలవెన్స్లు పెంచాలని కోరలేదని తెలిపారు. కంపెనీలో ముడిసరుకు కొరత సాకుగా చూపి, యాజమాన్యం కంపెనీని అర్ధాంతరంగా లే ఆఫ్ ప్రకటించడాన్ని తప్పుపట్టారు. విశాఖపట్నం డిసిఎల్, విజయనగరం ఎసిఎల్ వద్ద జరిగిన చర్చల్లో అధికారులు ఇచ్చిన సూచనలు, సలహాలు యాజమాన్యం పాటించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా జిందాల్ యాజమాన్యం దిగిరావాలని, లేని పక్షంలో ప్రజలను చైతన్య పరచి, పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గాడి అప్పారావు, నమ్మి చినబాబు, బాలిబోయిన ఈశ్వరరావు, బట్ట రాము, టిఎన్టియుసి నాయకులు పిల్లా అప్పలరాజు, సలాది భీమయ్య, వైఎస్ఆర్ టియుసి నాయకుడు లగుడు వామాలు, భూసాల అప్పారావు, జిడి నాయుడు, బి వెంకటరావు కార్మికులు పాల్గొన్నారు.
