ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్ స్టీల్ప్లాంట్ను ప్రయివేటుపరం చేసేందుకు జరుగుతున్న కుట్రలను పోరాటాలతో తిప్పికొడతామని పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, శ్రీనివాసరావు అన్నారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారం 1491వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్ప్లాంట్లోని పలు విభాగాల కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ… స్టీల్ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఏళ్ల పాటు కష్టపడి ప్లాంట్ ప్రగతికి కృషి చేసిన కార్మికులకు నేడు సరిగా జీతాలు ఇవ్వకుండా ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. బిజెపి అనుకూల కార్పొరేట్లకు ప్లాంట్ను కట్టబెట్టేందుకు జరుగుతున్న కుట్రలను తెలియజేశారు.
