ఫైలట్‌ అప్రమత్తం – విమానానికి తప్పిన ఘోర ప్రమాదం

శంషాబాద్‌ (హైదరాబాద్‌) : హైదరాబాద్‌ శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పింది. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. లేదంటే రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదం జరిగేది. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం …. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ 6 ఈ -6973 విమాన సర్వీస్‌ 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మీదుగా వైజాగ్‌ ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది. ఈ క్రమంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులు ఫైట్‌ ల్యాండింగ్‌ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించారు. దీంతో పైలట్‌ విమానం హైడ్రాలిక్‌ గేర్‌ను సిద్ధం చేశాడు. ఏటీసీ నుంచి క్లియరెన్స్‌ రావటంతో.. పైలట్‌ విమాన సర్వీస్‌ను డౌన్‌ చేశాడు. అయితే అప్పటికే రన్‌వేపై టేకాఫ్‌ తీసుకోవడానికి మరో విమానం సిద్ధంగా ఉంది. దాన్ని గమనించిన పైలట్‌ అప్రమత్తమయ్యాడు. వెంటనే తన విమానాన్ని గాల్లోకి లేపాడు. దీంతో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. రన్‌వేపై ఉన్న విమానం వెళ్లేంత వరకు 10 నిమిషాలపాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. అనంతరం పైలట్‌ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్‌ చేశాడు. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ విమాన సర్వీస్‌ వైజాగ్‌కు వెళ్లిపోయింది. పైలట్‌ అప్రమత్తంగా ఉండకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు అంటున్నారు. ఈ ఘటనపై ఏటీసీ అధికారులు విచారణకు ఆదేశించారు.

➡️