ఎస్వియులో ఘనంగా జానపద జాతర ప్రారంభం
ప్రజాశక్తి – క్యాంపస్ (తిరుపతి) : జానపద సాహిత్యం ప్రజల జీవన విధానమని, నమ్మకాలు, సంస్కతి, సంప్రదాయాలు, విలువలను ప్రతిబింబిస్తుందని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వియు) ఇంఛార్జ్ ఉపకులపతి ఆచార్య సిహెచ్ అప్పారావు అన్నారు. స్థానిక భాష, యాసకు జీవం పోసి, ఆయా ప్రాంతాల ప్రత్యేకతను తెలియజేస్తుందని వివరించారు. ప్రజా కళావేదిక, ఎస్వియు విద్యార్థుల సంక్షేమం, సాంస్కృతిక వ్యవహారాల డైరెక్టరేట్ సంయుక్త ఆధ్వర్యంలో రెండ్రోజులు పాటు జరిగే ”మన పల్లె జానపదం జాతర” కార్యక్రమం శుక్రవారం సెనేట్ హాల్లో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ రాతపూర్వక రూపం లేని జానపద సాహిత్యం… మౌఖికంగా ఒక తరం నుండి మరో తరానికి అందిందన్నారు. ప్రజల జీవన అనుభవాలు, కష్టాలు, ఆనందాలు, వారి రోజువారీ జీవితాలను ఇది ప్రతిబింబిస్తుందని వివరించారు. జానపద గేయాలు, నృత్యాలు, ఇతర కళా రూపాల్లో భాగమేనన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం భూపతి నాయుడు మాట్లాడుతూ జానపద సాహిత్యం ప్రజల మధ్య సామాజిక ఐక్యతను, బంధాలను పెంపొందిస్తుందన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 18వ శతాబ్దంలోనే జానపద సాహిత్యం వెలువడిందని తెలిపారు. భారతదేశ స్వాతంత్య్ర సమరంలో మన ప్రాంతం నుంచి విరివిగా చైతన్య గీతాలు రావడం గర్వకారణమన్నారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ పూర్వ సభ్యులు, ప్రముఖ రచయిత డాక్టర్ విఆర్ రాసాని మాట్లాడుతూ జానపద సాహిత్యంలో సామెతలు, చిక్కులు కూడా ఒక ముఖ్యమైన భాగమన్నారు. ప్రముఖ కాలమిస్ట్ నల్లాని రాజేశ్వరి మాట్లాడుతూ మౌఖిక సంప్రదాయాలను కాపాడటానికి, భవిష్యత్తు తరాలకు అందించడానికి ప్రజా కళావేదిక కషి సహాయపడుతోందన్నారు. తొలి రోజు దాదాపు వంద మంది కళాకారులు తమ గళాలను వినిపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గాయకులు తమదైన శైలిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ప్రజా కళావేదిక చైర్మన్ అరవ జయపాల్, ఎస్వియు కల్చరల్ అఫైర్స్ కో-ఆర్డినేటర్ పత్తిపాటి వివేక్, ఆదిశేషయ్య, ప్రముఖ కవి సురేంద్ర రొడ్డ, గుత్తా హరిసర్వోత్తమనాయుడు, జిఎస్ ప్రసాద్, రోజారమణి, నటరాజ నాయుడు, లింగుట్ల వెంకటేశ్వర్లు, ప్రజా కళావేదిక ప్రతినిధులు రావిళ్ల రజని పాల్గొన్నారు.
