సినీనటి జత్వానీ కేసులో … పిఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌

  • 7గంటల పాటు విచారణ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముంబాయికి చెందిన సినీనటి జత్వానీ కేసులో ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పిఎస్‌ఆర్‌ ఆంజనేయులును సిఐడి అధికారులు హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం అరెస్ట్‌ చేశారు. వేధింపులకు సంబంధించి జత్వాని ఫిర్యాదు చేసిన కేసులో పిఎస్‌ఆర్‌ ఆంజనేయులు రెండవ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులోనే సస్పెన్షన్‌కు గురై ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన్ను అరెస్టు చేసిన సిఐడి పోలీసులు విచారణ కోసం విజయవాడకు తీసుకువచ్చారు. హైదరాబాద్‌ నుండి నేరుగా విజయవాడలోని సిఐడి కార్యాలయానికి ఆయన్ను తీసుకువచ్చిన పోలీసులు, కొద్దిసేపు విశ్రాంతి ఇచ్చి, ఆ తరువాత విచారణ ప్రక్రియను చేపట్టారు. మంగళవారం నాడు ఆయన్ను దాదాపుగా ఏడు గంటల పాటు వివిధ అంశాలపై ప్రశ్నించారు. జత్వానీని, ఆమె కుటుంబ సభ్యులను వేధించడం వెనుక ఎవరున్నారు? అప్పటి విజయవాడ పోలీస్‌ కమిషనరు కాంతిరాణాటాటా, మరో ఐపిఎస్‌ అధికారి విశాల్‌గున్నీల పాత్ర ఏమిటి? ఎవరి ఆదేశాల మేరకు ఇంటిలిజెన్స్‌ అధికారిగా ఉండి ఈ కేసులో జోక్యం చేసుకున్నారు అన్న అంశాలపై విచారణాది óకారులు దృష్టి స్టారించారు. మద్యం పాలసీ, పంప కాలు, సిఎం చంద్రబాబునాయుడును అరెస్ట్‌ చేసే సమయంలో అరెస్ట్‌ చేసిన ఐపిఎస్‌ అధికారితో నడిపిన ఫోన్‌ సంభాషణలు, వైసిపి ప్రజాప్రతినిధుల ఫోన్‌ టాంపరింగ్‌ ఆరోపణలపై కూడా విచారణలో అడిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీలను కూడా త్వరలోనే అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంగళవారం రాత్రికి సిఐడి కార్యాలయంలోనే పిఎస్‌ఆర్‌ ఆంజనేయులను ఉంచారు. బుధవారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనన్నారు. జత్వానీ కేసుతో పాటు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణమరాజును కస్టోడియల్‌ టార్చర్‌ కేసు కూడా పిఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై ఉంది. ఉద్యోగ సంఘ నేత కెఆర్‌ సూర్యనారాయణను గతంలో బెదిరించిన సంఘటనపై , అప్పట్లో డిజిపికి ఉద్యోగ సంఘ నేత ఫిర్యాదు చేశారు. ఆ కేసు దర్యాప్తును గుంటూరు సిఐడి అధికారులు విచారిస్తున్నారు.

➡️