‘గాలి’ ఎప్పుడో అరెస్ట్‌ కావాలి…

  • ఖనిజ దోపిడీలో బిజెపి భాగం కాదా?
  • దక్షిణాదికి ఎన్‌డిఎ తీవ్ర ద్రోహం
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌ గనులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలి : సిహెచ్‌.నర్సింగరావు

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : గాలి జనార్ధనరెడ్డి గనుల దోపిడీలో కేంద్రంలోని బిజెపి భాగస్వామేనని, ఎప్పుడో గాలి అరెస్ట్‌ కావాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు అన్నారు. విశాఖ ఉక్కునగరంలోని సిఐటియు కార్యాలయంలో స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. గాలి జనార్ధనరెడ్డి అక్రమ ఇనుప ఖనిజం తవ్వకాలు చేసి విదేశాలకు ఎగుమతి చేశాడని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించిందని, ఈ తీర్పు 16 సంవత్సరాల తర్వాత వెలువడిందని తెలిపారు. 2000 నుంచి 2008 సంవత్సరం వరకు రూ.884 కోట్ల ఇనుప ఖనిజాన్ని గాలి జనార్ధనరెడ్డి అనంతపురం జిల్లా (బళ్లారి) నుంచి విదేశాలకు ఎగుమతి చేశారని కోర్టు రుజువు చేసిందని వివరించారు. ఇది ఆనాటి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ అండతోనే జరిగిందని విమర్శించారు. కోట్ల రూపాయల అవినీతి సొమ్మును బిజెపి దోచుకొని దేశ సంపదను గాలికి తాకట్టు పెట్టిందన్నారు. దక్షిణ భారతంలో ఇనుప ఖనిజం ఉన్న ఏకైక ప్రాంతం బళ్లారి అని, దానిని గాలికి కట్టబెట్టి విదేశాలకు ఎగుమతి చేశారని తెలిపారు. దక్షిణ భారతంలో మరొక స్టీల్‌ప్లాంట్‌ రాకపోవడానికి ప్రధాన కారణం ఇనుప ఖనిజం కొరతేనని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని భైల్‌ దిలా గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. గడిచిన 35 సంవత్సరాలుగా నాణ్యమైన స్టీల్‌ ఉత్పత్తి చేస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నేటికీ సొంత గనులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ లేకున్నా సొంత గనులను గాలి జనార్ధన్‌రెడ్డికి, పోస్కోతో సహా అనేక ప్రయివేట్‌ కంపెనీలకు కేటాయించడం దేశద్రోహమని అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఇప్పటికైనా సొంత గనులు సమకూర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ఈ దిశగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాస్‌, స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి పాల్గొన్నారు.

➡️