‘పి-4’ పేరిట పేదలను అవమానిస్తున్న చంద్రబాబు
ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలి
మీడియా సమావేశంలో బివి రాఘవులు
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం పత్రికా స్వేచ్చకు, వాక్ స్వాతంత్య్రానికి, సభా స్వాతంత్య్రానికి భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తోందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. పత్రికా స్వేచ్చను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతిలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు హాజరైన ఆయన స్థానిక వేమన విజ్ఞాన కేంద్రంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ద వైర్’ వెబ్సైట్ను కేంద్రం బ్లాక్ చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. కొన్ని న్యూస్ పోర్టళ్లను, కొంతమంది జర్నలిస్టుల మీడియా వేదికలను, జమ్మూ కాశ్మీర్లోని మక్తూం న్యూస్ పోర్టల్ను, అనురాధ భాషిన్ అనే జర్నలిస్టు, అర్పిత శర్మ అనే పొలిటికల్ కామెంటేటర్ వెబ్ సైట్లను, సోషల్ మీడియా వేదికలను కూడా కేంద్రం బ్లాక్ చేసిందని తెలిపారు. ఈ వెబ్ సైట్లను, సోషల్ మీడియా వేదికలను వెంటనే అనుమతించాలని డిమాండ్ చేశారు. విద్వేషాలు, వైషమ్యాలు పెంచే వేదికలను కొనసాగిస్తూ, ప్రశ్నించే శక్తులను బ్లాక్ చేయడం దారుణమన్నారు. బాధితులకు సంఘీభావంగా తాము నిలబడతామని, పోరాడుతామని తెలిపారు.
పాకిస్తాన్ను ఒంటరిపాటు చేయాలి…
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై అంతర్జాతీయ వేదికల ద్వారా ఒత్తిడి పెంచి ఒంటరిపాటు చేయాలని చెప్పారు. ఈ దిశలో కేంద్రం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులను భారత్కు అప్పగించేలా ఈ ఒత్తిడి ఉండాలని సూచించారు. దాడులకు మౌలికంగా సిపిఎం వ్యతిరేకమైనప్పటికీ ఎదుటివారు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోవాలన్నది దాని అర్ధం కాదని వివరించారు. మావోయిస్టులపై కేంద్రం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. చర్చలకు సిద్ధమంటున్న విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించకుండా మావోయిస్టులను హత్యలు చేయడం దారుణమని అన్నారు. తక్షణం కాల్పులు విరమించి మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు. దారిద్య్రాన్ని నిర్మూలించే పేరిట చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అమలు చేస్తోన్న ‘పి4’ విధానం పేదలను అవమానించేలా ఉందని చెప్పారు. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని పేదలను కార్పొరేటు శక్తులకు అప్పగిస్తోందని, కార్పొరేట్ సామాజిక బాధ్యత పేరిట కొన్ని కంపెనీలు కేటాయించే డబ్బును పేద కుటుంబాలకు ఖర్చు చేయడం ద్వారా దారిద్య్రం రాష్ట్రంలో పోతుందను కోవడం భ్రమేనని వివరించారు. దారిద్య్ర నిర్మూలనకు సహకరించే మార్గదర్శకులైన వారు ఆయా కంపెనీల్లో పని చేసే కార్మికులకు వేతనాలు పెంచి వారి నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.
దీర్ఘకాలిక విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి : వి.శ్రీనివాసరావు
విద్యుత్ కొనుగోలు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలతో చేసుకుంటున్న దీర్ఘకాలిక ఒప్పందాలు ప్రజలపై తీవ్రమైన భారాలను మోపేవిగా ఉన్నాయని ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెకీ ఒప్పందం వల్ల లక్షన్నర కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతుందని మాట్లాడారని, ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా కేసులు వేశారని,యూనిట్ను రెండున్నర రూపాయలకు కొనడం ఏమిటన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక యూనిట్ విద్యుత్తును యాక్సిస్ ఎనర్జీ కంపెనీ నుంచి నాలుగున్నర రూపాయలకు కొనుగోలు చేయాలని ఒప్పందం చేసుకోవడం మోసగించడం కాదా? అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. 25 సంవత్సరాలపాటు చేసుకున్న ఈ దీర్ఘకాల ఒప్పందాన్ని, సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
లౌకిక స్వభావాన్ని కోల్పోతున్న టిడిపి
రోజురోజుకూ టిడిపి తన లౌకిక స్వభావాన్ని కోల్పోతోందని ఆయన అన్నారు కేంద్రంలోని బిజెపి ఏది చెబితే దానికి తందానా అంటోందని విమర్శించారు. పొగాకు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. రాయలసీమ ప్రాంతంలో రైతుల పొలాలపై పడి ఏనుగులు తీవ్ర నష్టాన్ని కలగజేస్తున్నా పట్టనట్టు వ్యవహరిస్తుండడం అన్యాయమని తెలిపారు. అదాని కోసం విద్యుత్ స్మార్ట్ మీటర్ల పథకాన్ని వైసిపి ప్రతిపాదిస్తే ఎన్నికలకు ముందు టిడిపి తీవ్రంగా వ్యతిరేకించిందని, అదే మీటర్లను తిరిగి పెట్టించుకోవాలని వినియోగదారులపై టిడిపి కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ రాబోయే రోజ్ణుల్లో పెద్ద ఎత్తున చేపట్టే ఉద్యమాలకు తిరుపతిలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో రూపకల్పన చేశామని చెప్పారు. రాష్ట్రంలో 2.80 లక్షల మంది పేదలు ఇళ్ల పట్టాల కోసం నిరీక్షిస్తున్నారని తెలిపారు. ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి పాల్గొన్నారు.